సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్లోనూ హీరో అనిపించుకుటున్నారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఒకపక్క వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరో పక్క సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి వైద్యం అందించేందుకు ఆయన విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్తో జతకట్టిన సంగతి తెలిసిందే. దాని ద్వారా ఇప్పటి వరకు 1050 మందికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించి.. పేద పిల్లల పాలిట దైవంగా మారారు. తాజాగా మరో చిన్నారి గుండె ఆపరేషన్ కి సహాయం చేశారు మహేశ్. ఈ విషయాన్ని మహేశ్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. సహస్ర అనే ఒక సంవత్సరం పాపకి కావాల్సినవి సమకూర్చి ఆంధ్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆపరేషన్ చేయించారని, ప్రస్తుతం ఆ పాప క్షేమంగా ఉందని తెలిపారు నమ్రత. దీంతో ప్రేక్షకులు, అభిమానులు మహేశ్ బాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.