
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…‘‘సత్యదేవ్ జంగా గారు ఈ కథ బెంగాల్లో జరుగుతుంది అని చెప్పగానే ఆ అంశం చాలా ఎగ్జయిటింగ్ గా అనిపించింది. ఈ కథ మీద చాలా వర్క్ చేయడానికి స్కోప్ ఉందనిపించింది. క్యారెక్టర్స్ చాలా బాగా కుదిరాయి. దాన్ని ఇంకా ఎంత బెటర్ గా చేయొచ్చు అనే దానిపై వర్క్ చేశాను. లాక్డౌన్లో దొరికిన టైమ్ను బాగా ఉపయోగించుకున్నాను. లక్కీగా ఆ పవర్ఫుల్ క్యారెక్టర్స్కు తగ్గ ఆర్టిస్టులు దొరికారు. కథ పూర్తిగా డెవలప్ చేశాక నేరుగా నానిగారి దగ్గరకే వెళ్లి నరేషన్ ఇచ్చాను. మరో ఆప్షన్ కూడా అనుకోలేదు. ఆ పాత్రలో నానిగారు తప్ప మరెవ్వరూ కనపడలేదు. హీరోయిన్ గా సాయి పల్లవిగారు ఫస్ట్ ఆప్షన్. నాని గారికి ఈ విషయం చెప్పగానే తను చేస్తే ఈ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అని ఎగ్జయిట్ అయ్యారు. దేవదాసి వ్యవస్థ అనే పాయింట్ కథ ప్రకారం పశ్చిమ బెంగాల్ లో స్టార్ అయినా.. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఇలా ప్యాన్ ఇండియా స్థాయిలో దానిని చర్చిస్తాం. ఈ సినిమాలో దేవదాసి వ్యవస్థ అనేది మెయిన్ సబ్జెక్ట్ కాదు. కథలో క్యారెక్టర్కి భాగంగా తీసుకున్నదే. దానికి వ్యతిరేకంగా లీడ్ క్యారెక్టర్ పోరాడుతాడు. సమాజానికి షార్ప్ గా ఎలాంటి మెసేజ్ ఇవ్వగలడో అలాంటి సందేశం ఇస్తాడు. స్క్రీన్ ప్లే పరంగా, విజువల్ పరంగా ఈ సినిమా కొత్తగా ఉంటుంది. ఫస్టాఫ్లో వాసు క్యారెక్టర్ కృతిశెట్టితో లవ్స్టోరీ చాలా బాగుంటుంది. అందులో ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ ఉంది. దానిలోనుంచి ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ ఉంటుంది. అలా ఒక్కో అంశం డెవలప్ అవుతూ కథ సాగుతుంది. ఈ స్క్రిప్ట్ అనుకున్న రోజే శ్యామ్ సింగరాయ్ అనే టైటిల్ కూడా అనుకున్నాం. నాని గారి నుంచి ఆయన ఫ్యాన్స్ ఆశించే అన్ని అంశాలు సినిమాలో ఉన్నాయి. మా నిర్మాత వెంకట్ బోయినపల్లి గారు కూడా ఈ కథను, నాని గారిని పూర్తిగా నమ్మారు. ప్రమోషన్స్ కూడా హై బడ్జెట్తో చేస్తున్నారు. క్లైమాక్స్ పార్ట్ చిత్రీకరణ చాలా చాలెంజింగ్ అనిపించింది. రెండు రోజులు షూటింగ్ చేశాం. అది ఎందుకు అనేది సినిమా విడుదలయ్యాక చెప్తాను. ఈ సినిమా కోసం సాయిపల్లవి క్లాసికల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. పగలంతా రిహార్సల్ చేయడం రాత్రి పెర్ఫామ్ చేయడం అలా ఏడు రోజుల పాటు ఆ సాంగ్ షూటింగ్ కంటిన్యూగా చేసింది. ప్రస్తుతం టైమ్ ట్రావెల్ జోనర్లో ఒక కథ రెడీగా ఉంది. అది మరో డిఫరెంట్ జోనర్ ఈ సినిమా తర్వాత దాని గురించి ఆలోచిస్తాను.’’ అని చెప్పుకొచ్చారు.